శ్రీ కూర్మం - క్షేత్రం ధర్శిద్దాం రండి

శ్రీ కూర్మం - క్షేత్ర దర్శనం



మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో.. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. అంతేకాదు మరెన్నో విశిష్ఠతలు ఈ ఆలయం సొంతం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి.
స్థల పురాణం
పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మదించడానికియత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. కింద ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా.. విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ, బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది.

వారణాసి తర్వాత..
పితృ కార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెల్లలేని చాలామంది ఇక్కడే పితృ కార్యాలు నిర్వహిస్తుంటారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితి నాడు ఇక్కడికి వచ్చి శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. తాము విడిచిన పాపాలను ఆ మాత ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. అంతటి పవిత్రమైన ఈ పుష్కరిణిలో పితృదేవతల అస్థికలు కలిపితే కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే చాలామంది ఇక్కడ తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తుంటారు.
ఎప్పుడు స్థాపించారు..?
శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. కృతయుగంనాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది. నిర్మాణ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. నిజానికి ఇప్పటికీ ఆలయం ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలీదు. ఏడో శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యం తెలుస్తూ వచ్చింది. దీంతో వివిధ రాజవంశాల వారు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు.8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. శ్రీరాముడి తనయులు లవకుశలు కూడా ఆలయాన్ని సందర్శించారని చెబుతుంటారు.
ఆకర్షించే శిల్పరాతి సౌందర్యం
ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ద్వారాలు, స్తంభాలపై చక్కని శిల్ప సంపద మరింత ఆకర్షణగా నిలుస్తుంది. అబ్బుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఒక దానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరో విశేషం.

సౌకర్యాలు..
కూర్మనాథ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. దీంతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవెల్లి కూడా ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ రెండు ఆలయాలను చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో బస చేయొచ్చు.
ఎలా చేరుకోవాలి..?
బస్సులో వెళ్లేవారికోసం శ్రీకాకుళం పాత బస్టాండ్‌ నుంచి ప్రతి 15 నిమిషాలకు అరసవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. దీంతో పాటు ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వెళ్లేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళానికి చేరుకుని వెళ్లాల్సి ఉంటుంది.
పూజలు- దర్శన వేళలు
జ్యేష్ఠ బహుళ ద్వాదశినాడు స్వామివారి జయంతి. ఆ రోజు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు.
* అభిషేకం (తిరుమంజనం): ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు
* ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు ప్రతి రోజూ స్వామివారి దర్శనం ఉంటుంది.

Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

Remedy for wealth and hapiness

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018

South direction dakshina dikku దక్షిణ దిక్కుకి తిరిగి ఎందుకు నమస్కరించ కూడదు?

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

108 శక్తి పీఠాలు:

తద్దినాలు పెట్టడము అవసరమా